పల్నాడు జిల్లాలో విషాద ఘటన... కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురి మృతి

  • పల్నాడు జిల్లాలో ఘోర పడవ ప్రమాదం
  • బంధువుల ఇంటి వేడుకకు వెళ్లి తిరిగొస్తుండగా ఘటన
  • పడవలో ఉన్న 10 మందిలో ఇద్దరు మృతి, ఇద్దరు గల్లంతు
  • ఆరుగురిని సురక్షితంగా కాపాడిన స్థానికులు
  • గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఏపీలోని పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అచ్చంపేట మండలం, కోనూరు గ్రామం వద్ద కృష్ణా నదిలో ఓ పడవ బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 

వివరాల్లోకి వెళితే, కోనూరు గ్రామంలోని కుంకలగుంట గంగయ్య అనే వ్యక్తి ఇంటికి బంధువులు వేడుక కోసం వచ్చారు. అనంతరం, సరదాగా గడిపేందుకు 10 మంది కలిసి ఒక చిన్న పడవలో నదిలో షికారుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పడవ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్నవారంతా నీటిలో మునిగిపోయారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. వారు ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు. మిగిలిన నలుగురు గల్లంతు కాగా, సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాలింపు చర్యల్లో నలుగురి మృతదేహాలను వెలికితీశారు. 

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Palnadu
Krishna River
Boat Capsize
Andhra Pradesh News
Achampet Mandal
Konuru Village

More Telugu News